పలు పోటీలకు ఆహ్వానాలు కోరుతూ ప్రకటన విడుదల చేసిన రాచకొండ సీపీ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ఈ నెల 21న రాచకొండ పోలీస్ కమిషనరేట్లో పోలీస్ పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీ సుధీర్బాబు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి యేడాది నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల తరహాలోనే అక్టోబర్ 21 నుంచి పోలీసులు, విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై ఆన్లైన్ వ్యాస రచన పోటీలు, పోలీస్ సంబంధిత అంశాలతో షార్ట్ ఫిల్మ్, ఆన్లైన్ ఫొటోగ్రఫీ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ పోటీల్లో రాచకొండ కమిషనరేట్ పరిధి పోలీసుస్, విద్యార్థులు, పౌరులు పాల్గొనాలని సూచించారు. పోటీలకు సంబంధించిన వివరాలను రాచకొండ సోషల్ మీడియా అకౌంట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు, ఎంట్రీలను ఈ నెల 27వ తేదీలోపు పంపాలన్నారు. అదేవిధంగా 21న అంబర్పేటలో ప్రత్యేక మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.