24-03-2025 10:32:23 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): నల్గొండ జిల్లా నకిరేకల్ లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలో భాగంలో తొలి రోజు తెలుగు ప్రశ్నాపత్రం నకిరేకల్ గురుకుల పాఠశాలలో లీక్ అయింది. పరీక్ష మొదలైన కాసేపటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. జిల్లా అధికారులకు వాట్సాప్ లో ప్రశ్నాపత్రం చేరడంతో డీఈఓ భిక్షపతి, ఆర్డీఓ అశోక్రెడ్డి, నకిరేకల్ ఎంఈఓ నాగయ్య, జిల్లా పరీక్షల విభాగం అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్ తో పాటు డిపార్ట్ మెంటల్ అధికారి రామ్మోహన్ రెడ్డి ఇద్దురు అధికారులను విధుల నుంచి తొలగించి, పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్ గా ఉన్న టీజీటీ సుధారణిని అధికారులు సస్పెన్షన్ చేశారు.
ఇప్పటివరకు తెలుగు ప్రశ్నాపత్రం లీక్ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో బాలుడు, జిరాక్స్ కేంద్రం నిర్వాహకుడు ఉన్నారు. బాలుడు గోడ దూకి పరీక్ష జరుగుతున్న తరగతి గది వద్దకు వచ్చి విద్యార్థిని పరీక్ష రాస్తుండగా కిటికీలో నుంచి ప్రశ్నాపత్రాన్ని సెల్ ఫోన్ తో ఫోటో తీసుకొని జిరాక్స్ కేంద్రంలో ఇచ్చినట్లు సమాచారం. నిందితుల నుంచి 5 సెల్ ఫోన్స్, జిరాక్స్ యంత్రం, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. తన ప్రమేయం లేకపోయినా డిబార్ చేశారని బాధిత విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేస్తూ తనకు పదో తరగతి పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించాలని అధికారులకు విజ్ఞాప్తి చేసింది. బాధిత విద్యార్థిని, తండ్రిని పోలీసులు విచారించారు.