02-03-2025 06:29:13 PM
కమిషనరేట్ లో శ్రీపాదరావు జయంతి వేడుకల్లో సీపీ శ్రీనివాస్...
రామగుండం (విజయక్రాంతి): రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రవుగా చిరస్మరణీయుడు శ్రీపాద రావు అని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు. మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమీషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి సీపీ ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సీపీ మాట్లాడుతూ... కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన శ్రీపాదరావు సర్పంచ్ గా, సమితి ఉపాధ్యక్షుడిగా ఎల్ఎంబి బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారని, 1983 నుండి వరుసగా మూడుసార్లు మంథని ఎమ్మెల్యేగా గెలిచారని, 1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు హత్య చేశారని, సర్పంచ్ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి, శాసనసభ్యుడిగా, శాసన సభాదిపతిగా పదవి చేపట్టి పదవికే వన్నె తెచ్చారన్నారు.
రాష్ట్రానికి ఎనలేని సేవచేశారని గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రవుగా పేరుగాంచరని సీపీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, ఆర్ఐ లు వామన మూర్తి, శ్రీనివాస్, సంపత్, సిసి హరీష్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.