08-04-2025 12:22:24 AM
ప్రకాశ్ నగర్ నుంచి బైక్ ర్యాలీగా సీపీఐ (ఎం) జిల్లా కార్యాలయానికి..
ఖమ్మం, ఏప్రిల్ 7 (విజయక్రాంతి ):సీపీఐ (ఎం) అఖిలభారత 24వ మహాసభల ప్రతినిధిగా మధురై వెళ్లి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ మృతికి పలువురు నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు. మధురై లోని అపోలో ఆసుపత్రిలో ఆదివారం మృతి చెందిన ఆయన భౌతిక కాయాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు ఖమ్మం తీసుకొని వచ్చారు. పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీగా ప్రకాష్ నగర్ నుంచి చర్చి కాంపౌండ్ మీదుగా మమత హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. అక్కడ బాడీ డీకాంపోజ్ కాకుండా రసాయన చర్యలు పూర్తయ్యాక తిరిగి బైక్ ర్యాలీగా సీపీఐ (ఎం) జిల్లా కార్యాలయానికి భౌతికకాయాన్ని తీసుకొని వచ్చారు.
మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు ఓ గంటపాటు భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. వివిధ పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు, సీపీఐ (ఎం) కార్యకర్తలు, శ్రీకాంత్ అభిమాను లు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... ప్రజా ఉద్యమాలకు, సీపీఐ (ఎం) పార్టీకి యర్రా శ్రీకాంత్ మరణం తీరని లోటు అని పేర్కొన్నారు.