calender_icon.png 19 September, 2024 | 9:41 PM

శ్రీలంక x భారత్

27-07-2024 02:55:45 AM

  1. నేడు తొలి టీ20 మ్యాచ్
  2. రాత్రి 7.00 నుంచి

పల్లెకెలె: జింబాబ్వేపై టీ20 సిరీస్ నెగ్గి జోష్ మీదున్న ప్రపంచ చాంపియన్ టీమిండియా నేటి నుంచి శ్రీలంక తో సిరీస్‌కు సిద్ధమయింది. టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ కెప్టెన్సీకి వీడ్కోలు పలకడంతో సూర్యకుమార్ జట్టును నడిపించనున్నాడు. సూర్య సారథ్యంలోని టీమిండియా నేడు శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ కాంబినేషన్ శుభారంభం చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరం. పొట్టి ప్రపంచకప్ అనంతరం రోహిత్, కోహ్లీ, జడేజా త్రయం టీ20లకు గుడ్ బై చెప్పడంతో వారి స్థానాలు భర్తీ చేసేందుకు యువ ఆటగాళ్లు తహతహలాడుతున్నారు. జింబాబ్వేతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

బ్యాటింగ్ విషయానికి వస్తే గిల్, జైస్వాల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించనుండగా.. వన్‌డౌన్‌లో రిషబ్ పంత్ రానున్నాడు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్, సంజూ శాంసన్, శివమ్ దూబే, పాండ్యా బ్యాట్ ఝలిపించేందుకు సిద్ధమయ్యారు. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌తో పాటు సుందర్ లేదా బిష్ణోయిలలో ఒకరు తుది జట్టులో ఉండనున్నారు. అర్ష్‌దీప్, ఖలీల్, సిరాజ్ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు. మరోవైపు హసరంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో నూతన సారథిగా చరిత్ అసలంక ఎంపికయ్యాడు. అసలంక నేతృత్వంలోని లంక.. చందీమల్, కుషాల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, పెరీరా, అవిష్కలతో బ్యాటింగ్ పర్వాలేదనిపిస్తోంది. షనక, పతీరానా, తీక్షణ, హసరంగాలతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది.