25-04-2025 11:02:13 AM
కాటారం,(విజయక్రాంతి): జమ్ము కాశ్మీర్ లో పర్యాటకులపై దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దుదిళ్ల శ్రీను బాబు అన్నారు. బుధవారం రాత్రి మంత్రిని నియోజకవర్గంలోని కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పహల్గామ్ లో తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన యాత్రికులకు కన్నీటి నివాళి అర్పించి శ్రీను బాబు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఇలాంటి దాడులు పునరాకృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఈ చర్యకు పాల్పడిన పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలను తరిమి కొట్టాలన్నారు. ఈ దేశ భద్రతను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుందని, అమాయకమైన ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నది కేంద్ర ప్రభుత్వమే నని ధ్వజమెత్తారు. ఈ దాడిలో తెలంగాణ వాసి, ఐబీ అధికారి మనీష్ రంజన్ తో పాటు 28 మంది మృతి చెందడం పట్ల శ్రీను బాబు విచారం వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.