calender_icon.png 27 September, 2024 | 9:41 AM

ఏడాదిలోగా స్పాంజ్ ఐరన్ యూనిట్లను తరలించాలి

27-09-2024 01:29:34 AM

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జనావాసాలకు కిలోమీటరు దూరంలోని స్పాంజ్ ఐరన్ యూనిట్లను ఏడాదిలోగా తరలించాలంటూ ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కార్యాచరణ నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని ఆదేశించింది. అంతేగాకుండా అక్కడ నడుస్తున్న మిగిలిన యూనిట్లు పర్యావరణ చట్టాలకు అనుగుణంగా నడుస్తున్నాయో లేదో పరిశీలించి రెండు నెలల్లో రిజిస్ట్రార్‌కు నివేదిక అందజేయాలని కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశించింది.

పంట నష్టాలకు పరిహారంగా పరిశ్రమలు డిపాజిట్ చేసిన సొమ్మును రైతులకు పంపిణీ చేయాలని, అదేవిధంగా ఇంకా ఇలా స్పాంజ్ ఐరన్ పరిశ్రమల వల్ల పంట నష్టపోయిన రైతులున్నట్లయితే చట్టప్రకారం వారిని గుర్తించి పరిహారం అందజేయాలని ఆదేశిస్తూ పిటిష్ప విచారణను ముగించింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోడిచర్ల, తీగాపూర్, గుండ్లపట్లపల్లి, రంగారెడ్డిగూడ అప్పాజీపల్లి తండాలో వ్యవసాయ క్షేత్రాల్లో స్పాంజ్ ఐరన్ పారిశ్రామిక యూనిట్లు నిర్వహిస్తుండటాన్ని సవాలు చేస్తూ 2005లో షాద్‌నగర్‌కు చెందిన టీ వీరేందర్రెడ్డి మరో 8 మంది పిల్ దాఖలు చేశారు.

పరిశ్రమల కాలుష్యం వల్ల పంటలు దెబ్బతింటున్నాయని, వ్యవసాయం చేయలేకపోతున్నట్టు పిటీషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై హైకోర్టు ఆదేశాల మేరకు పీసీబీ నివేదికను సమర్పించింది. జైసీ స్పాంజ్ ప్రొఫైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి ఉద్యోగ్ లిమిటెడ్, జీకే స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్, శీతల్ షిప్పింగ్ అండ్ మెటల్ ప్రాసెసర్స్ లిమిటెడ్, బింజు మెటల్స్ అండ్ అలాయ్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, హార్మొనీ స్పాంజ్ ఐరన్ ఇండస్ట్రీ, శివధాత్రి ఫెరాయ్ అల్లాయ్స్, ఏపీఎస్‌ఎం అల్లాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్, దేవశ్రీ ఇస్పాత్ లిమిటెడ్లు పని చేయడంలేదని పేర్కొంది.

టీఎస్‌ఐఐసీ 2020లో ప్రణాళిక సమర్పిస్తూ నివాస ప్రాంతాలకు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనంద్ మెటాలిక్స్ అండ్ పవర్, సుందర్ ఇస్పాత్ లిమిటెడ్, వినాయక స్టీల్స్, రాయిటర్ మెటల్స్ ఆఫ్ ఇండియా, కేడియా అల్లాయ్స్ లిమిటెడ్, సిరి శివశక్తి స్టీల్స్ అల్లాయ్స్లను మరోచోటికి తరలించాలని సిఫారసు చేసిందని తెలిపింది. బిలస్రాయికా స్పాంజ్ ఐరన్ ఇండియా, బింజుసారియా స్పాంజ్ అండ్ పవర్, రాయిటర్స్ మెటల్స్ ఆఫ్ ఇండియాలు కిలోమీటరు కంటే దూరంలో ఉన్నాయని చెప్పింది. వీటన్నింటినీ పరిశీలించిన ధర్మాసనం ప్రజల నివాసాలకు కిలోమీటరు దూరంలోని యూనిట్లను తరలించాలని ఆదేశించింది. ప్రస్తుతంనడుస్తున్న యూనిట్లు నిబంధనల పాటిస్తున్నాయో లేదో పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.