calender_icon.png 8 October, 2024 | 10:12 PM

పుష్పరాజ్‌తో ప్రత్యేకంగా..

04-10-2024 12:19:03 AM

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత హైప్ క్రియేట్ చేసుకున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉందా? అంటే అందరూ సందేహం లేకుండా ఠక్కున చెప్పే పేరు ‘పుష్ప2’. అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం అల్లు అర్జున్ స్టుల్, నటనతోనే పాన్ ఇండియా స్థాయిలో సాలిడ్ హైప్ నెలకొంది.

అందుకే పార్ట్ 1కు ఏమాత్రం తగ్గకుండా పార్ట్ 2ను చిత్రబృందం తీసుకొస్తోంది. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఎలా ఉండబోతోందని అందరూ మాట్లాడుకుంటున్నారు. సుకుమార్ సినిమాలో ప్రత్యేక గీతాలను అభిమానించేవారు ఎక్కువ. 1వ భాగంలో సమంత ప్రత్యేక గీతంలో ఎంతగానో ఆకట్టుకుంది.

దీంతో పార్ట్2లో ఎవరు చేయబోతున్నారనే టాక్ నడుస్తోంది. ఇందుకోసం మొదటి ఛాయిస్‌గా దేవర ఫేమ్ జాన్వీ కపూర్ పేరు రేసులోకి వచ్చింది. తర్వాత ఆమె కాకుండా నేషనల్ క్రష్ అనిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ పేరు కూడా ఈమధ్య బాగా వినిపించింది. తాజాగా రేస్‌లోకి మరో పేరు చేరింది.

ఆ నటి ఎవరో కాదు.. బ్లాక్ బస్టర్ కలెక్షన్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరోలకు సవాళ్లు విసిరిన ‘స్త్రీ మూవీ ఫేమ్ శ్రద్ధా కపూర్. శ్రద్ధా రీసెంట్ గా బాలీవుడ్ లో 800 కోట్లకు పైగా వసూళ్లతో ఎలాంటి సెన్సేషన్‌ను సెట్ చేసిందో అందరికీ తెలిసిందే.

మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు శ్రద్ధా పేరును కూడా మేకర్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రద్ధను తీసుకుంటే బాలీవుడ్ మార్కెట్‌లో పుష్ప మరింత హైప్ దక్కుతుందని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఈ క్రేజీ జంట కలయికలో ఆ పాట చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుందో లేదో చూడాలి.