08-04-2025 11:28:18 PM
పోలీసు అధికారులతో సీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నగరంలో ఈ నెల 12న జరుగబోయే శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా చిన్న ఊరేగింపులు అనుసంధాయం అయ్యే కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సూచించారు. మంగళవారం నగర పోలీసు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మతపరమైన ప్రదేశాల వద్ద సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ప్రత్యేక అదనపు బలగాలను మోహరించి, నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు. ముందస్తు చర్యగా సంబంధిత సీఐలు శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా అవాంతరాలు ఉన్నచోట సంబంధిత అధికారులకు తెలిపి సరి చేయించాలన్నారు.
ఊరేగింపులో డీజేలను వినియోగించకుండా, ఫైర్ క్రాకర్లు పేల్చడం, బాట సారులపై వేయటం, గులాల్ రంగు పోయకుండా చూడాలని నిర్వాహకులకు తెలపాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విజయ యాత్ర ముగిసిన తరువాత, తిరుగు ప్రయాణములో సంయమనం పాటించాలన్నారు. రెచ్చగొట్టే బ్యానర్లను ప్రదర్శించొద్దని, పరిమిత సంఖ్యలో వాహనాలను ఉపయోగిస్తూ, వర్గాల ప్రజలకు ఎలాంటి ఆటంకం కులకకుండా చూసుకోవాలన్నారు.
పోలీసు శాఖ ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాల వినియోగానికి అనుమతి లేదని, సోషల్ మీడియాలో పుకార్లను నమ్మవద్దు, రెచ్చగొట్టే పోస్ట్లు, ఫేక్ మెసేజ్లు వాటిని వ్యాప్తి చేయవద్దని పేర్కొన్నారు. ప్రత్యేకంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర ఎలాంటి పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ లు జరగకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, డిసిపి ఎస్.చైతన్య కుమార్, డిసిపి ఐటి సెల్ పుష్ప, వర్చువల్ గా జోనల్ డిసిపిలు, ఇన్స్పెక్టర్లు ఏసీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.