19-04-2025 01:46:46 AM
జగిత్యాల, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాలలో అర్ధరాత్రి నుంచి తెల్లవార్లు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రాత్రి సమయంలో నిఘా పటిష్టం చేస్తూ, సమయానుకూల చర్యలు తీసుకోవడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని జిల్లా ఎస్పి ఆలోచన మేరకు జగిత్యాల పట్టణంలోని ప్రదాన కూడల్లు, బస్ స్టాండ్, చౌరస్తాల్లో, రహదారి పాయింట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిషేధిత మత్తుపదార్ధాలు, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నేరాలు నివారించడం, నిషేధిత మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా నిరోధించడం, చట్టవిరుద్ధ చర్యలపై పటిష్ట నిఘా పెట్టడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి వారి వివరాలను సేకరించడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కి సమాచారం అందించాలని సూచించారు. సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని అదికారులు కోరారు.