20-03-2025 07:00:59 PM
బెల్లంపల్లి ఏసిపి రవికుమార్..
మందమర్రి (విజయక్రాంతి): జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తెలిపారు. సర్కిల్ పరిధిలో పట్టణంలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలైన బ్లాక్ స్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆన్నారు. దీనిలో భాగంగా వాహనాల వేగాన్ని తగ్గించడం కోసం అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులను, రోడ్డు మధ్యలో లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అదే విధంగా జాతీయ రహదారి దగ్గరలో గల గ్రామాల ప్రజలు నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే రోడ్డు దాటాలని, రైతులు వారి యొక్క పశువులను రోడ్లపైకి విడిచిపెట్టరాదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై జి రాజశేఖర్, మందమర్రి ఎస్సై ఎస్ రాజశేఖర్ లు పాల్గొన్నారు.