22-03-2025 12:00:00 AM
ముషీరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి) : అద్వాన స్థితికి చేరుకున్న రోడ్లను ప్రణాళిక బద్ధంగా ఆధునీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్ డివిజన్ లోని ఏక్ మినార్, దయారా మార్కెట్లోని భరణి ఆయిల్ మిల్ సమీపంలో, ఎంసీహెచ్ కాలనీలో రూ. 34 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్, జీహెచ్ఎంసీ డీఈ గీతా కుమారి, ఏ ఈ మురళి తో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లను అభివృద్ధి పరిచేందుకు కావాల్సిన నిధులను సమకూర్చుకుంటూ ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా అభివృద్ధి పరుస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ పై ప్లాన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు.
కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధికి జీహెచ్ఎంసీ కమీషనర్ కు పలు మార్లు విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం రోడ్ల అభివృద్ధికి వినతి పత్రాలు అందజేశారని పేర్కొన్నారు. గంగపుత్రకాలనీ, భరత్ నగర్, బాపూజీ నగర్ రోడ్ల ఆధునీకరణకు రూ. 82 లక్షలతో ప్రతిపాధనలు సిద్ధం చేయగా జీహెచ్ఎంసీ నిధులు మంజూరు చేయకపోవడంతో కౌన్సిల్ సమావేశంలో రోడ్ల విషయం ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్ర మంలో బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా, బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్, ముషీరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు కొండా శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు శివ ముదిరాజ్, దీన్ దయాల్ రెడ్డి, పి. శ్రీధర్ చారి, టెంట్ హౌస్ శ్రీనివాస్, బీఆర్ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, బల్లా ప్రశాంత్, పూస గోరక్నాథ్, వెంకటేష్, ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జమాల్ పూరి నందు, బీజేవైఎం నాయకులు అనిల్ కుమార్, కుషాల్ గౌడ్, ఆయూష్, నందు తదితరులు పాల్గొన్నారు.