ఐర్లాండ్పై 139పరుగుల తేడాతో విజయం
అబుదాబి: అఫ్గానిస్థాన్కు వన్డే సిరీస్ కోల్పోయి చావుదెబ్బ తిన్న దక్షిణాఫ్రికా మళ్లీ ట్రాక్ ఎక్కినట్లే అనిపిస్తోంది. బుధవారం రాత్రి ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 139 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.
ఓపెనర్ రికెల్టన్ (102 బంతుల్లో 91) టాప్ స్కోరర్గా నిలవగా.. ట్రిస్టన్ స్టబ్స్ (79) రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడెయిర్ 4 వికెట్లు పడగొట్టగా.. క్రెయిగ్ యంగ్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం 272 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఐర్లాండ్ 31.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జార్జ్ డొక్రెల్ (21), ఆండ్రూ బాల్బర్ని (20), కర్టీస్ కాంపర్ (20) పర్వాలేదనిపించారు.
సఫారీ బౌలర్లలో లిజాడ్ విలియమ్స్ 4 వికెట్లతో ఐర్లాండ్ పతనాన్ని శాసించగా.. ఫోర్టున్, ఎన్గిడి చెరో 2 వికెట్లు పడగొట్టారు. సఫారీ జట్టు భారీ స్కోరు చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన రెయాన్ రికెల్టన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే నేడు జరగనుంది. కాగా ఇరుజట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో సౌతాఫ్రికా, ఐర్లాండ్ చెరో మ్యాచ్ నెగ్గాయి.