యూపీలో 35 కోట్లు కాజేసిన జంట
కాన్పూర్, అక్టోబర్ 4: అం దంగా, నిత్య యవ్వనంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి? మ నిషులకు ఉన్న ఈ బలహీనతే కొం దరికి మంచి వ్యాపారంగా మారుతున్నది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన రాజీవ్కుమార్ దూబే, రష్మీదూబే అనే భార్యాభర్తలు వృద్ధులను మళ్లీ సోర పిల్లలుగా మారుస్తామని నమ్మించి ఏకంగా రూ.35 కోట్లు కొల్లగొట్టారు. కాన్పూర్లో వారు ‘రివైవల్ వరల్డ్’ పేరుతో ఓ తెరపీ సెం టర్ ప్రారంభించారు.
తమ వద్ద ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన టైమ్ మెషిన్ ఉన్నదని, దాని ద్వారా 60 ఏండ్ల వృద్ధులను కూడా 25 ఏండ్ల యువతీ యువకులుగా మారుస్తామని నమ్మబలికారు. 10 దఫాలుగా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందని, ఒక్కో సెషన్కు రూ.6 వేలు ఫీజు అని ప్రకటించారు.
ఈ ప్రకటనలు చూసి వృద్ధులు ఎగబడ్డారు. అయితే ఎంతకూ తమ ఆకారాల్లో మార్పు లు రాకపోవటంతో రేణు సింగ్ అనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వద్ద నిందితులు రూ.10.75 లక్షలు ఫీజుల రూపం లో గుంజారు. ఇలా మొత్తం రూ.35 కోట్ల వరకు కాజేశారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.