calender_icon.png 5 October, 2024 | 2:25 PM

తండ్రిని కడతేర్చిన తనయుడు

05-10-2024 12:28:41 PM

గొడ్డలితో నరికి హత్య 

కుటుంబ కలహాలతో దారుణం 

రాజేంద్రనగర్, విజయక్రాంతి : తనయుడు తండ్రిని కడ తేర్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రా నగర్ దొడ్డిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఊట్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడనే సమాచారంతో శుక్రవారం సాయంత్రం ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆకుల రాములు(52), పోచమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు శివకుమార్ ఉన్నారు. రాములు గతంలో కొన్నేళ్లపాటు సెక్యూరిటీ గార్డ్ గా పని చేశాడు ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. కొంతకాలంగా ఆయన మద్యానికి బానిస అయ్యాడు. రోజు మద్యం తాగుతూ కుటుంబ సభ్యులతో గొడవపడుతూ వేధించసాగాడు. డబ్బుల కోసం కూడా వేదిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రాములు తన కుమారుడు శివ కుమార్ ను మద్యం కోసం డబ్బులు అడిగాడు. దీనికి అతడు నిరాకరించాడు అనంతరం శివకుమార్ తాను నడిపి ఆటోను తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం సమయంలో రాళ్లగూడ ప్రాంతంలో రాములు తన కొడుకు ఆటోను చూసి ఆపమని అడిగాడు. శివకుమార్ ఆటోను ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. రాములు ఇంటికి వెళ్లి గొడ్డలి తీసుకొని కుమారుడు ఉండే అతడి అత్తగారింటికి వెళ్ళాడు. రాములు తన కొడుకు పై దాడి చేసే యత్నం చేశాడు. క్షణికావేషానికి గురైన శివకుమార్ తన తండ్రి చేతుల్లో నుంచి గొడ్డలి లాక్కొని అతడి కాళ్ళపై, ఆ తర్వాత వీపుపై ఆడి చేయడంతో కుప్పకూలిపోయాడు. ఘటన స్థలంలో రాములు భార్య పోచమ్మ కూడా ఉంది. అనంతరం తీవ్రంగా గాయపడిన రాములను కోటిపల్లి వెంకటేశ్వర కాలనీ లోని ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత రాత్రి సుమారు 7 గంటలకు రాములు మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.