25-04-2025 05:26:12 PM
నిర్మల్ (విజయక్రాంతి): భూభారతి చట్టం అమలు ద్వారా ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలన్నీ మండల స్థాయిలో పరిష్కారానికి వీలుంటుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) తెలిపారు. శుక్రవారం లక్ష్మణచందా మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సులో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ... భూభారతి చట్టం అమలు ద్వారా ప్రజల భూ సమస్యలన్నీ సులభంగా వేగంగా పరిష్కరించేందుకు వీలు పడుతుందన్నారు.
భూముల రిజిస్ట్రేషన్, తదితర అంశాల పరిష్కారానికి దరఖాస్తులు చేసుకున్న వాటికి నిర్నిత గడువు ఉంటుందని, ఆ గడువు లోపలే అధికారులు వీటన్నింటిని పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కువ శాతం భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సమస్యలు మండలంలోని తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించబడతాయన్నారు. క్రయవిక్రయాల ద్వారా పట్టా మార్పిడి, వారసత్వ పట్టా మార్పిడి వంటి అనేక పనులు సులభతరంగా చేసుకోవచ్చన్నారు. ఈ నూతన భూభారతి చట్టాన్ని అనుసరించి ప్రజలకు ఉచిత న్యాయ సహాయం లభిస్తుందన్నారు. సాదాబైనామా ప్రక్రియ తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వల్ల ఎంతో మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
ఈ చట్టం ద్వారా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరళతరం చేయడం వల్ల అధికారుల చుట్టూ మాటిమాటికి తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల భూ సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, తహసిల్దార్ జానకి, ఎంపీడీవో రాధా రాథోడ్, మండల ప్రత్యేక అధికారి మోహన్ సింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, డిసిసిబి వైస్ చైర్మన్ రఘునందన్, మండల వ్యవసాయ అధికారి వసంతరావు, ఇతర అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.