హైకోర్టు ఆదేశం
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 1: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం ఫార్మా భూబాధితులు గత సంవత్సరం వేసిన పిటిషన్కు సంబంధించి విచారణ జరిపిన హైకోర్టు.. వెంటనే పిటిషనర్ల పేర్లను ధరణిలో నమోదు చేయడంతో పాటు వారికి రావాల్సిన ప్రయోజనాలన్నీ కల్పించి.. నాలుగు వారాల్లో కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ మంగళారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. దాదాపు 172 మంది ఫార్మాభూబాధిత రైతులు.. భూసేకరణ చట్టం ప్రకారంగా రైతులకు అందవలసిన ప్రయోజనాలు అన్నీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2023లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ధరణిలో తమ పేర్లు తొలగించారని, రైతుబంధు, రైతు బీమా రావడం లేదని.. వెంటనే తమ పేర్లు తిరిగి చేర్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ మేరకు హైకోర్టు.. కలెక్టర్, ఆర్డీవో, యాచారం తహసీల్దార్లతో పాటు టీజీఐఐసీ రాష్ట్ర భూసేకరణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.