25-04-2025 12:38:28 AM
కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మల్యాల, కొడిమ్యాల మండలాల్లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పాల్గొన్నారు.
భూ భారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ స్వయంగా రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ వల్ల ఇబ్బంది పడని రైతు ఎవరూ లేరన్నారు. 15 నెలల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి పేద ప్రజలకు న్యాయం జరిగేలా భూ భారతి చట్టం ప్రవేశ పెట్టారని అన్నారు.
భూ భారతి చట్టం ప్రవేశం పెట్టడమే కాకుండా అధికారులను గ్రామాలకు పంపి భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన సన్న ధాన్యంకు నేడు యాసంగి సీజన్లో కూడా ప్రభుత్వం క్వింటాల్ వడ్లకు 500 రూపాయల బోనస్ అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి మధుసూదన్, మల్యాల తహసిల్దార్ మునీందర్, ఎంపీడీవో, ఏఎంసి చైర్మన్, రైతులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.