calender_icon.png 20 September, 2024 | 11:18 PM

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు

16-09-2024 02:58:25 PM

శోభాయాత్ర మరియు నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పోలీస్ పరంగా పకడ్బందీ ఏర్పాట్లు.

  సిసి కెమెరాల పర్యవేక్షణలో శోభాయాత్ర. 

కరీంనగర్, (విజయక్రాంతి): ప్రధాన చోట్ల రూఫ్ టాప్ బందోబస్త్ ఏర్పాటు బందోబస్త్ లో పాల్గొనే అధికారులకు పలు సూచనలు చేసిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్, కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలోని జాన్ విల్సన్ హాలు నందు గణేష్ నిమజ్ఙన బందోబస్తులో పాల్గొనే అధికారులకు సోమవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, నిమజ్జన కేంద్రాలయిన మానకొండూరు చెరువు, చింతకుంట కెనాల్, కొత్తపల్లి చెరువులతో పాటు, గణేష్ శోభాయాత్ర జరిగే రూట్ ల యందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు.

నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఇతర ముఖ్యమైన చోట్ల  పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో రూఫ్ టాప్ లో సైతం బందోబస్త్ ఏర్పాటు చేశామని తెలిపారు. అధికారులు మరియు సిబ్బంది అంతా నిమజ్జన కార్యక్రమం ముగిసే వరకు అప్రమత్తంగా వుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరిగేలా పోలీస్ పరంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా పోలీసులు జారీచేసిన నియమాలు ఉల్లంఘించి ప్రజా శాంతికి భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ శాంతి భద్రతలు ఎ లక్ష్మీనారాయణ , ఏసీపీ లు శ్రీనివాస్ (సి. ఎస్. బి.), నరేందర్ (టౌన్), కాశయ్య , మాధవి , విజయ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.