calender_icon.png 27 October, 2024 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఖర్చులతో ఇళ్లకు సోలార్ పవర్

14-09-2024 12:45:57 AM

  1. పైలెట్ ప్రాజెక్టు కింద కొండారెడ్డిపల్లి, సిరిపురం 
  2. పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తికి ప్రణాళికలు
  3. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, సెప్టెంబర్ 13(విజయక్రాంతి): రాష్ర్టంలో గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంపుదల అంశంపై శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ర్టంలో కొన్ని ప్రత్యేక గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని ఆయా గ్రామాల్లో ఉన్న రైతుల వ్యవసాయ పంపుసెట్లకు సంపూర్ణంగా ప్రభుత్వ ఖర్చులతో సోలార్ పవర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తద్వారా వచ్చే విద్యుత్తును పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని సూచించారు. దీని ద్వారా రైతులకు పంటలపై ఆదాయమే కాకుండా ప్రతి ఏటా సోలార్ పవర్ ద్వారా రైతులకు వ్యక్తిగతంగా నిర్దిష్టంగా ఆదాయం సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 

గృహాలకు సోలార్ పవర్..

కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద గృహాలకు ప్రభుత్వ ఖర్చులతో సోలార్ పవర్ ఏర్పాటు డిప్యూటీ సీఎం సూచించారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లితో పాటు మధిర నియోజకవర్గంలోని సిరిపురం, మరో 20 గ్రామాలను రాష్ర్టవ్యాప్తంగా ఎంపిక చేసుకొని ముందుకు పోవాలని దిశానిర్దేశం చేశారు. సోలార్ పవర్‌తో ఆయా గ్రామస్తులకు ఆదాయాన్ని సమకూర్చడమే ప్రభుత్వం ప్రధాన ఆలోచన అని వివరించారు. రాష్ర్టంలోని ఎంపిక చేసిన, స్వయం సహాయక సంఘాలకు ఐదు నుంచి పది మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకోవడానికి వారిని ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.

సోలార్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు నుంచి రుణాలు సైతం ఇప్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్తును ప్రభుత్వమే బై బ్యాక్ పద్ధతిలో కొనుగోలు చేస్తుందని డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ర్టంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గ్రీన్ ఎనర్జీ దోహదపడుతుందని తెలిపారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ సంకల్పమని భట్టి అన్నారు.

మొత్తంగా గ్రీన్ ఎనర్జీ ద్వారా పల్లెల్లో రైతులకు, పేదలకు స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్వావలంబన కలిగే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ర్ట విద్యుత్ అవసరాలు సైతం పూరించే అవకాశం లభిస్తుందన్నారు. తద్వారా  వివిధ వర్గాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అధికారులకు తెలిపారు. సమావేశంలో తెలంగాణ రెడ్ కో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనీల, ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.