12-03-2025 12:00:00 AM
హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద..
హనుమకొండ, మార్చి 11 ( విజయ క్రాంతి): వరంగల్ నగరంలోని భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియ వేగవంతంగా జరగాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి.ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద అన్నారు. మంగళవారం భద్రకాళి చెరువు లో పూడికతీత పనుల పురోగ తిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి పరిశీలించారు.
భద్రకాళి చెరువు నుండి పూడికతీత మట్టి తరలింపు రూట్ మ్యాప్, వాహనాల రాకపోకలకు సంబంధించి వేస్తున్న ఫార్మేషన్ రోడ్డు పనులు, మట్టి తరలించేందుకు ఇచ్చే వాహనాల కూపన్లను పరిశీలించారు. భద్రకాళి చెరువు పూడికతీత మట్టిని ఎంత తరలించారనే వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
చెరువులో నుండి కట్టవరకు చేపట్టిన ఫార్మేషన్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపును అధికారులు వేగవంతం చేయాలన్నారు. పూడికతీత మట్టి ని బుధవారం నుండి ప్రారంభించాలన్నారు. పూడికతీత మట్టి పనులు జరుగుతున్న ప్రాంతంలో విద్యుత్తులైట్లను ఏర్పాటు చేయాలన్నారు.
మట్టి తరలింపు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చర్యలు చేపట్టాలన్నారు. పూడికతీత మట్టి పనులు సజావుగా సాగేటట్టు అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, సాగునీటిపారుదల శాఖ ఈఈ శంకర్, డీఈ హర్షవర్ధన్ , కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీం రావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.