12-04-2025 01:03:10 AM
మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన భారత సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని, ఆయన స్ఫూర్తిని కొనసాగించడం ద్వారానే సామాజిక ప్రగతి సాధ్యమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుక్రవారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
శక్తివంతమైన భారత సమాజ ఐక్యతను బలహీన పరుస్తున్న వర్ణ వివక్ష నుంచి విముక్తి కోసం తన జీవితకాలం ఫూలే దంపతులు పోరాడారని కొనియాడారు. కులం, జెండర్ వంటి సామాజిక రుగ్మతను రెండు శతాబ్దాల క్రితమే పసిగట్టి, పరిష్కారం కోసం కృషి చేసిన సామాజిక దార్శనికులన్నారు.
ఉత్పత్తి కులాలైన సబ్బండ వర్ణాల అభ్యున్నతికి నాటి తెలంగాణ తొలి ప్రభుత్వం ఫూలే ఆదర్శాలను కార్యాచరణలో పెట్టిందని గుర్తు చేశారు. సామాజిక న్యాయం అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలి చిందిని కేసీఆర్ తెలిపారు. ఫూలే స్ఫూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యాచరణను నేటి ప్రభుత్వం చిత్తశుద్ధితో కొనసా గించాలని, తద్వార బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా మైనారిటీ పేద వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.