calender_icon.png 25 October, 2024 | 11:53 AM

చిరుద్యోగులకు వేతనాలు అందడం లేదు: ఎమ్మెల్సీ వాణీదేవి

02-08-2024 12:40:46 AM

చిన్నచిన్న ఉద్యోగులకు వేతనాలు సరైన సమయంలో అందడంలేదని, ప్రతి నెల ఒకటో తేదీన రావడంలేదని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. నెలల్లో ఏదో ఒక రోజున ఇవ్వడంతో ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆశ, అంగన్‌వాడీ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్ లెక్చరర్ వంటి ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని ఆర్థిక ఇబ్బందులతో వేతనాలు ఇవ్వలేక పోతున్నామని సమాధానం చెప్పారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉందని, వారికి త్వరలో వేతనాలు సకాలంలో అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి ప్రసంగిస్తూ.. రాష్ట్రంలో 25 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వం మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు మాత్రం పదోన్నతి కల్పించడంలేదన్నారు. కొత్త పోస్టులు భర్తీ చేయాలని, వారికి 010 కింద వేతనాలు చెల్లించాలని, మృతి చెందిన మోడల్ స్కూల్స్ టీచర్ల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరారు.