12-04-2025 12:25:15 AM
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): భారతదేశంలో ఇప్పుడు చిరుధాన్యాల (మిల్లెట్స్) ఉద్యమం నడుస్తున్నదని, ప్రతి ఒక్క రూ రోజు తినే ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవాలని అపోలో ఆసుపత్రుల జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి పిలుపునిచ్చారు. చిరుధాన్యాల్లో పోషకాలు అధికంగా ఉంటాయని జీర్ణవ్యవస్థ పై ప్రభావం చూపుతాయని తెలిపారు.
తెనాలి డబుల్ హార్స్ గ్రూప్, మిల్లెట్స్ మార్వెల్స్ అనే సంస్థతో కలిసి చిరుధాన్యాల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమం లో నూడిల్స్, గ్రైన్స్, రెడీ టు కుక్, రెడీ టు సర్వ్ అంటూ నాలుగు విభాగాల్లో 18 రకాల ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సంగీతారెడ్డి హాజరై మాట్లాడారు.
చిరుధాన్యాల స్వీకరణ సంస్కృతిని దేశానికి తిరిగి తీసుకురావటం అత్యవసరం అన్నారు. ప్రధాని మోదీ 2023ను మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించారని, దానికి కొన్ని సంవత్సరాల క్రితమే డాక్టర్ భరత్ మిల్లెట్ మార్వెల్స్ను స్థాపించారని చెప్పారు. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సీఎండీ మోహన్ శ్యామ్ మాట్లాడుతూ.. మిల్లెట్ మార్వెల్స్తో కలిసి మిల్లెట్స్ వ్యాపారంలోకి 18 ఉత్పత్తులతో ప్రవేశించామని ప్రకటించారు.
త్వరలో ఆర్గానిక్ ఉత్పత్తుల రంగంలోకి అడుగు పెడతామని చెప్పారు. మిల్లెట్ మార్వెల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ భరత్రెడ్డి మాట్లాడుతూ.. మిల్లెట్ మార్వెల్స్ కల ఈరోజు నిజమైందని అన్నారు. దానిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తెనాలి డబుల్ హార్స్ వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో ఆనందిత్రెడ్డి, ఐఐఎంఆర్ డైరెక్టర్ దయాకర్, సినీ నిర్మాత దిల్ రాజు, తెనాలి డబుల్ హార్స్ సీఈవో యజుర్వేద, సీవోవో ఫోటో శేఖర్, జగదీష్ పాల్గొన్నారు.