calender_icon.png 18 October, 2024 | 10:52 PM

ఈ ఏడాది 6.5-7% వృద్ధి

23-07-2024 12:05:00 AM

ఆర్థిక సర్వే  అంచనా 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి 6.5-7 శాతం ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. మంగళవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెం టులో ప్రవేశపెట్టనుండడంతో సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే సభ ముందుంచారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగినా దేశీయ వృద్ధి చోదకాలు ఆర్థికానికి అండగా నిలిచాయని సర్వే స్పష్టం చేసింది.

మున్ముందు ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ముందుకు దూసుకెళ్లనుందని వ్యాఖ్యానించింది. అయితే అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలు, వాటి ప్రభావం ఆర్‌బీఐ ద్రవ్య విధానాలను ప్రభావితం చేయొచ్చని అభిప్రాయపడింది. ప్రైవేటు క్యాపిటల్ మార్కెట్ బలంగా ఉందని సర్వే స్పష్టం చేసింది. దేశంలో నిరుద్యోగిత తగ్గుముఖం పడుతోందని పేర్కొంది. 2025లో బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసే అవకాశాలు బాగా ఉన్నట్లు అభిప్రాయపడింది.

కీలక అంశాలు

  1. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది
  2. 2030 దాకా వ్యవసాయేతర రంగంలో ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు అవసరం
  3. ఇప్పటికీ ఆర్థిక చోదక శక్తిగా వ్యవసాయం
  4. బలంగా ఉన్న క్యాపిటల్ మార్కెట్. భారత వృద్ధిలో దీనిదే కీలక పాత్ర
  5. 2022- 23నాటికి 3.2 శాతానికి తగ్గిన నిరుద్యోగిత
  6. ఐటీ నియామకాలు అంతంత మాత్రమే
  7. దేశంలో స్థూలకాయం పెరగడంపై ఆందోళన
  8. అమృత్ కాలపు వృద్ధికి 6 వ్యూహాలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశ ఆర్థిక రంగం 6.5 నుంచి 7 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది.   మంగ ళవారం కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో 202౩ 2౪ ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరుతో బాటుగా రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసి చెప్పేదే ఈ ఆర్థిక సర్వే. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎకనామిక్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను రూ పొందిస్తుం ది. ఆర్థిక సర్వే అంచనాలు రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసిన 7.2 శాతంకన్నా తక్కువగా ఉన్నాయి.

అయితే అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), ఆసియా అభివద్ధి బ్యాంక్( ఏడీబీ) అంచనలయిన 7 శాతం వృ ద్ధికి అనుగుణంగా ఉండడం గమనార్హం. భౌగోళిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొం టూ భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పటిష్ఠం గా ఉందని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. ప్ర పంచ అస్థిరతల నడుమ అధిక వృద్ధి ఆకాంక్షలు కలిగిన దేశానికి మార్పు మాత్రమే స్థి రంగా ఉంటుందని ఈ సర్వే పేర్కొంది. వాణి జ్యం, పెట్టుబడులు , వాతావరణం వంటి  కీలకమైన ప్రపంచ సమస్యలపై ఒప్పందాలను చేరుకోవడం కష్టంగా మారిందని పేర్కొంది.

కృత్రిమ మేధ

వివిధ నైపుణ్యాలకు చెందిన ఉద్యోగాలపై కృత్రిమ మేధ( ఏఐ) ప్రభావం ఎలా ఉంటుందనే విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొందని ఆర్థిక సర్వే తెలిపింది. అయితే ఈ అధునాతన సాంకేతికత వల్ల ఆవిష్కరణలు  ఊపందుకుంటున్నాయని, రాబోయే రోజుల్లో పని విధానాల్లో సమూల మార్పు లు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని రంగాల్లో పెద్ద ఎత్తునఆటోమేషన్  రాబోతోందని తెలిపింది. సృజనాత్మక రంగంలో ఏఐ సాధనాల వినియోగం పెరుగుతుందని పేర్కొంది.

ఐటీ నియామకాలు

గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగంలో నియామకాలు గణనీయంగా మందగించాయని, రాబోయే రోజుల్లో ఇవి మరింతగా తగ్గకపోయినా గణనీయంగా పుంజుకునే అవకాశం లేదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవడం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఎక్కడా లేని సామర్థ్యాన్ని సంగ్రహించడం ద్వారా వ్యాపార, కన్సల్టెన్సీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులను విస్తరించవచ్చని సర్వే పేర్కొంది.

అమృత్ కాలపు వృద్ధికి వ్యూహాలు

న్యూఢిల్లీ: 2047 వరకు కొనసాగనున్న ‘అమృత్ కాలం’లో అనుసరించాల్సిన కీలక వ్యూహాలను ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. అవి...

ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం: ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి వీలుగా ప్రైవేటు రంగ పెట్టుబడులను పెంచాలి. అందుకోసం ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలి.

ఎంఎస్‌ఎంఈల విస్తరణ: భారత్‌లోని సూక్ష్య, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ధి, విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్థిక వ్యవస్థలో వాటి పాత్రను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలి.

వృద్ధి చోదకంగా వ్యవసాయం: ఇప్పటికే ఉన్న అడ్డంకులను తొలగించడం ద్వారా వ్యవసాయాన్ని ప్రధాన వృద్ధి చోదకంగా తీర్చిదిద్దాలి. ఫలితంగా ఆ రంగంలోని శక్తి, సామర్థ్యాలను సదివనియోగం చేసుకోవాలి.

గ్రీన్ ట్రాన్సిషన్ ఫైనాన్షింగ్: దేశ సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ దిశగా చేపడుతున్న హరిత, స్వచ్ఛ పరివర్తన చర్యలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. 

విద్య- ఉపాధి అంతరాన్ని తగ్గించడం: శ్రామిక శక్తి సంబంధిత నైపుణ్యాలు కలిగి ఉండేలా విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చడం చాలా కీలకం.

ప్రభుత్వ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం: ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తూ వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో పబ్లిక్ సెక్టార్ పాత్ర చాలా కీలకం. అందుకు అనుగుణంగా ప్రభుత్వ శక్తి సామర్థ్యాలను బలోపేతం చేయాలి.

ఫుడ్ కూపన్లు లేదా నగదు బదిలీ: ద్రవ్యోల్బణం నుంచి ఆహారోత్పత్తుల విభాగాన్ని తప్పించాలి. రిజర్వ్‌బ్యాంక్ వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోవడానికి కోర్ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. ఆహారోత్పత్తుల ధరలతో సతమతమవున్న  ప్రజలకు ఫుడ్ కూపన్లు అందించడం లేదా నగదు బదిలీని కేంద్ర ప్రభుత్వం చేయాలి.

ఫైనాన్షియల్ రంగంపై కన్ను:  దేశీయ ఫైనాన్షియల్ రంగం  ఆరోగ్యకరం ఉన్నప్పటికీ, ఈ రంగం పోకడలను నిశితంగా గమనిస్తూ ఉండాలి.

క్యాపిటల్ మార్కెట్: భారత్ వృద్ధికి క్యాపిటల్ మార్కెట్ ముఖ్య చోదకంగా మారింది. అయితే డెరివేటివ్ మార్కెట్లో పెరుగుతున్న స్పెక్యులేషన్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.

78.5 లక్షల ఉద్యోగాలు: వ్యవసాయేతర రంగంలో 2030కల్లా ఏడాదికి 78.5 లక్షల ఉద్యోగాలను కల్పించాల్సిన అవసరం ఉన్నది. 

చైనా ఎఫ్‌డీఐ: చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆకర్షించాలి