అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద వేగంగా దూసుకోచ్చిన కారు అదుపుతప్పి లారీని ఢీకోట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు టైరు పగిలి లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జు అయింది. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్ కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అధికవేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.