18-02-2025 01:31:18 AM
అధికారులతో సమీక్షలో సీఎండీ బలరామ్
హైదరాబాద్, ఫిబ్రవరి 17(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ సుస్థిర భవిష్యత్తే ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగికి ప్రథమ కర్తవ్యం కావాలని, ఇందుకు అందరూ తమకు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సిందేనని, అలసత్వం ప్రదర్శించే వాళ్లకు కంపెనీలో స్థానం ఉండదని సంస్థ సీఎండీ బలరామ్ స్పష్టంచేశారు.
పోటీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి వీలుగా సంస్థ భవిష్యత్ కోసం వచ్చే పదేళ్లకు అవసరమైన ప్రణాళికలను ప్రతి విభాగం అధిపతులు సిద్ధం చేయాలని ఆదేశించారు. 11 ఏరియాల జీఎంలు, 39 గనుల ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లతో తొలిసారిగా సింగరేణి భవన్లో సోమవారం సమీక్ష నిర్వహించారు.
రానున్న 43 రోజుల్లో మిగిలిన లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా సాధించాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు డీ సత్యనారాయణ (ఈ అండ్ ఎం), ఎల్వీ సూర్యనారాయణ (ఆపరేషన్స్), కే వేంకటేశ్వర్లు (పీఅండ్పీ), అడ్వుజర్(ఫారెస్ట్రీ) మోహన్ పర్గేన్ పాల్గొన్నారు.