గోదావరిఖని (విజయక్రాంతి): సింగరేణిలో మారు పేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గోలేటి నుంచి కొత్తగూడెం వరకు డిపెండెంట్ బాధితులు చేపట్టిన పాదయాత్ర మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చేరుకుంది. దీంతో ఇక్కడ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డిలు పాదయాత్రకు స్వాగతం పలికి పూలమాలలు వేసి తమ మద్దతు తెలిపారు. భూపాలపల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి తమకు కారుణ్య నియామకాలు ఇప్పించాలని కోరారు. మారు పేర్లు, విజిలెన్స్ విచారణ పేరిట సింగరేణి కార్మికుల పిల్లలను ఉద్యోగాల్లోకి తీసుకోకుండా అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వం వేధించడం సరి కాదని పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం 30 ఏళ్ల క్రితం నిరక్షరాస్యులుగా ఉన్న కార్మికులను మారుపేరులతో విధుల్లోకి తీసుకున్నారని, ఇప్పుడు వారి డిపెండెంట్ లకు మారు పేర్లు అడ్డు చెబుతూ ఉద్యోగాల్లోకి తీసుకోకుండా విజిలెన్స్ విచారణ పేరిట కాలయాపన చేయడం మానుకొని వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.