22-04-2025 01:55:43 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో సెర్ప్లో వందశాతం బదిలీలకు అనుమతులిచ్చారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సెర్ప్లో 3,974 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
పదేళ్ల తర్వాత సెర్ప్లో సాధారణ బదిలీలు కానున్నాయి. ఏండ్లుగా బదిలీలు కాకపోవడంతో తమ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు ఉద్యోగులు కోరారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చాలా మంది సిబ్బంది ఒకే చోట పాతుకుపోవడంతో పనుల్లో వేగం పెంచేందుకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రజాప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలను స్వయం ఉపాధి నుంచి ఉపాధి కల్పన, సంపద సృష్టి దిశగా తీర్చిదిద్దుతుంది. ఈ ప్రక్రియ వేగవంతం కోసం బదిలీలు ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న బదిలీలను ప్రజాప్రభుత్వం చేపట్టడంతో సెర్ప్ ఉద్యోగుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది.