26-03-2025 12:31:25 AM
కల్లూరు మార్చి25:- రణ ధ్వని శబ్దాల కంటే నిశ్శబ్దం ఎంత భయంకరమో.. నిజాన్ని మభ్య పెట్టడం అంత ప్రమాదకరం. అది ఏదో ఒక రోజు అబద్ధపు గోడలను బద్దలు కొట్టుకుంటూ బయటకు రావడం ఖాయం.15 సంవత్సరాలుగా సెర్ప్ గోడల మధ్యనే నలిగిన స్త్రీ నిధి రుణాలు గోల్ మాల్ వ్యవహారం ఒక్కసారిగా బయటపడడంతో అవినీతి వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో స్త్రీనిధి రుణాలు గోల్ మాల్ పై వచ్చిన పత్రిక కథనాలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టారు. మం డలంలో ఏడు క్లస్టర్ లు ఉండగా అవినీతి జరిగిందని అనుమానంతో కొత్తగా వచ్చిన ఏపీఎం బీరవల్లి రాంబాబు ఒక క్లస్టర్ ని ఆడిట్ చేయించగా లక్షల రూపాయలు స్వాహా అయినట్లు బయటపడింది.
వెలుగులో స్త్రీనిధి రుణాలు లక్షలలో అవినీతి జరిగిందన్న విషయం మండలంలో చర్చగా మారడమే కాకుండా మిగతా 6 క్లస్టర్ లో ఆడిట్ జరిగితే ఎన్ని కోట్ల రూపాయల అవినీతి వెలుగు చూసే అవకాశాలున్నాయనేది హాట్ టాపిక్ గా మారింది. కానీ రోజులు గడుస్తున్న జరిగిన ఆడిట్ పై చర్యలు కానీ, మిగతా క్లస్టర్ లో ఆడిట్ చేయించాలనే ఆలోచన గాని ఎందుకు చేయడం లేదనేది ప్రశ్నార్ధకంగా మారింది.
అవినీతికి ఎవరైన కొమ్ముకాస్తున్నారా..?. లేక నిజాన్ని నిశ్శబ్దంగా ఉంచుదామనుకుంటున్నారా..?. అ నేది పలు అనుమానాలు రేకెత్తిస్తుంది.అవినీతి ఆరోపణలపై జిల్లా అధికారి అసిస్టెంట్ డి ఆర్ డి ఏ నూరుద్దీన్, స్త్రీనిధి రీజినల్ మేనేజర్ రవీంద్రనాయక్ విచారణ చేసిన సంగతి అందరికీ తెలిసిందే కానీ వాటికి సంబంధించిన నివేదికలు గాని, విచారణలో ఏం తేలిందోననేది ఇప్పటివరకు స్పష్టత లేదు.
అవినీతి రుజువైందా..? లేదా..? అనేది తెలియదు.ఒకవేళ అవినీతి జరిగి ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. దీనిపై అధికారులు మౌనము వీడాల్సిన అవసరం ఉం దని మండల ప్రజలు అంటున్నారు.
డ్వాక్రా గ్రూప్ మహిళలు కష్టపడి తమ కష్టార్జితంతో స్త్రీనిధి రుణాలు చెల్లిస్తే గ్రామదీపికలు అధికారుల అండదండలతో వాటిని కాజేశార నేది ప్రధాన అంశం.ఆడిట్ నిర్వహణతో ఒక్కసారిగా అవినీతి జరిగినట్లు తేటతెల్లమైంది. కొంతమంది గ్రామదీపికలు చేసిన తప్పుకి స్త్రీనిధి రుణాలు పొందే అవకాశం లేకుండా పోయింది.
అవినీతిపై చర్యలేవి..?
తప్పించుకోవడానికి గాని, తప్పుకోవడానికి గాని వీలులేని రికార్డు పరమైన ఆధా రాలు,తాము తప్పుచేశామని ఒప్పుకొని రా యించి ఇచ్చిన పత్రాలు ఉన్నప్పటికీ అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది స్థానికుల ప్రశ్న.ప్ర భుత్వ సొమ్ము ఒక రూపాయి అవినీతికి పాల్పడిన ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.
కానీ నిరుపేద మహిళల కష్టార్జితం కాజేసిన వారిపై చర్యలుండవని ప్రశ్నిస్తున్నారు.స్త్రీనిధి రుణాలు విషయంలో అవకతవకలకు పాల్పడి ఒక క్లస్టర్ లో 54 లక్షల రూపాయలు అవినీతి బహిర్గతమైన వాటి మీద విచారణ జరిపిన అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో అధికారులు నిజాయితీని శంకిస్తున్న పరిస్థితి నెలకొంది.
కావున స్త్రీనిధి రుణాలపై జరిగిన అవినీతిపై పటిష్టమైన చర్యలు చేపట్టి వారిపై చర్యలు తీసుకొని డబ్బులు రికవరీ చేయాలని,మి గతా 6 క్లస్టర్ లో వెంటనే ఆడిట్ జరిపించాలని మండల ప్రజలు జిల్లా అధికారులను కోరుతున్నారు.