వాహనదారుడిపై దాడి కింద పడేసి తొక్కుతూ హల్చల్
రాబరీ కేసు పెడతానంటూ బాదితుడికే బెదిరింపులు. ?
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: ప్రజా రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీస్ అధికారి తన వాహనానికి ఎదురుగా వచ్చాడన్న అక్కస్సుతో ఓ ద్విచక్ర వాహనదారుడిపై దాడి చేసి బూట్ కాళ్లతో తొక్కుతూ పిడిగుద్దులు కురిపిస్తూ హల్చల్ చేశాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకాగా సోమవారం వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన మిడిదొడ్డి రంజిత్ అనే వ్యక్తి ఓ బట్టల దుకాణం నడుపుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఆదివారం రాత్రి తన దుకాణం మూసి ఇంటికి వెళుతున్న క్రమంలో హౌసింగ్ బోర్డ్ లోని శాన్వి ఆసుపత్రి ముందర తన ఇంటి వైపు మల్లెక్రమంలో పానగల్ మండలం ఎస్సై కళ్యాణ్ రావు హౌసింగ్ బోర్డ్ నుండి టీస్31డి 4445 హుండై అమెజ్ అనే కారు అక్కడే యూటర్న్ తీసుకుంటుండగా ఇద్దరూ ఒకరినొకరు ఎదుర్పడ్డారు.
తన కారుకు అడ్డంగా నిలిపాడని ద్విచక్ర వాహనదారుడితో వాదనకి దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో సివిల్ లో ఉన్న ఎస్ఐ కారులో నుంచి దిగి ద్విచక్ర వాహనదారుడిపై దాడికి దిగాడు. నడిరోడ్డుపై కిందపడేసి పిడిగుద్దులు కురిపించాడు. ఈ క్రమంలోనే ఎస్సై మెడలో వేసుకున్న లాకెట్ తెగిపడిందని మరింత కోపంతో రగిలిపోయి స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి మరోసారి దాడి జరిపినట్లు బాధితుడు ఆరోపించాడు. దీనిపై స్థానిక ఎస్ఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఇదే విషయంపై ఎస్సై కళ్యాణ్ రావుని వివరణ కోరగా తాను పూర్తిగా తాగి వాహనం నడుపుతున్నాడని అలాంటి వ్యక్తి తనపై దాడి చేసే ప్రయత్నం చేశాడని తాను ఆత్మ రక్షణ కోసమే ప్రతిదాడికి పాల్పడినట్లు తెలిపారు. తన మెడలో ఉన్న 70వేలు విలువచేసే లాకెట్ దొంగిలించాడని ఆరోపించాడు. దీనిపై తాను న్యాయబద్ధంగా పోరాడతానన్నారు. ఇదే విషయంపై స్థానిక ఎస్సై గోవర్ధన్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా తాను అందుబాటులోకి రాలేదు.