- ఒకే తేదీల్లో ఎస్జీఎఫ్ ఆటల పోటీలు, ఎస్ఏ1 పరీక్షలు
- 21 నుంచి 28 వరకు ఎస్ఏ1 ఎగ్జామ్స్
- అక్టోబర్ 23 నుంచి నవంబర్ 5 వరకు గేమ్స్
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖలో అధి కారులు తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. విద్యార్థుల భవిష్యత్కు చదువెంత ముఖ్యమో.. వా రి శారీరక, మానసిక ఉల్లాసానికి ఆట లు అంతే ముఖ్యం. ఆటలు ఆడటం, పరీక్షలు రాయడం ఒకేసారి సాధ్యపడదు.
ఈ మాత్రం గ్రహించని కొందరు అధికారులు తమ ఇష్టానుసారంగా ఉత్తర్వులను జారీ చేస్తున్నారనే విమర్శలు ఉపాధ్యాయ వర్గాల్లో వినిపిస్తు న్నాయి. అక్టోబర్ 21 నుంచి 28 వరకు ఎస్ఏ1 పరీక్షలను, అక్టోబర్ 23 నుంచి నవంబర్ 5 వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) నిర్వహించనున్నారు.
రెండింటినీ ఏకకాలంలో నిర్వహిస్తే అటు పరీక్షలపై, ఇటు ఆటలపై విద్యార్థులు దృష్టి సారించలేరని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 5 వరకు వివిధ తేదీల్లో జిల్లా కేంద్రాల్లో తైక్వాండో, ఖోఖో, జూడో, వాలీబాల్, కబడ్డీ, కరాటే పోటీలు జరగనున్నాయి. ఇలా ఏకకాలంలో పరీక్షలు, ఆటల పోటీలు నిర్వహించడం సరికాదని, షెడ్యూల్లో మార్పు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.