calender_icon.png 2 February, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ష్..గప్‌చుప్!

02-02-2025 01:29:28 AM

  1. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య భేటీ 
  2. అధికారంలో ఉండీ పనులు చేయించుకోలేపోతున్నామని ఆవేదన
  3. ఆ ఎమ్మెల్యేలకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ ఫోన్

హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : అధికార పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారన్న వార్త ప్రకంపనలు రేపుతోంది. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బీసీ రిజర్వేషన్లు పెంపు, మరోవైపు ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పార్టీలో హాట్ టాపిక్‌గా మార గా, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల రహ స్య భేటీ కలకలం సృష్టిస్తోంది.

సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి, ఆరు గ్యారెంటీల విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు దూకుడు పెంచగా, సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇలా సమావేశం ఏర్పాటుచేసుకోవడం చర్చనీ యాంశంగా మారింది. 

హైదరాబాద్‌లోని ఒక ప్రయివేట్ హోటల్‌లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో దొంతి మాధవ రెడ్డి (నర్సంపేట),  భూపతిరెడ్డి (నిజామాబాద్ రూరల్), యెన్నెం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్) కే రాజేష్‌రెడ్డి (నాగర్‌కర్నూల్), పటోళ్ల సంజీవరెడ్డి (నారాయణఖేడ్), మురళీనాయక్ (మహబూబాబాద్), మేఘారెడ్డి (వనపర్తి)తోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ప్రధానంగా ఒక మంత్రి తీరుపై అసంతృప్తితోనే వారు సమావేశమైనట్లుగా సమాచారం. సదరు మంత్రి తమను పట్టించుకోవడం లేదని, తమ నియోజకవర్గంలో.. తమకు తెలియకుండానే పనులు జరుగుతున్నాయని వారు అసహనం వ్యక్తం చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఓ కీలక మంత్రి నియోజకవర్గంలో భూములు రెగ్యులరైజేషన్ చేసుకుంటున్నారని ఎమ్మెల్యేలు ఆగ్ర హంతో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. నిధులు విడుదలోనూ అన్యాయం జరుగుతుందనే చర్చ జరిగినట్లు సమాచారం. అధి కార పార్టీలో ఉన్నా ఏమి పనులు జరగడం లేదని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులకు మాత్రం చకాచకా పనులు జరుగుతున్నాయని వారు చర్చించినట్లు తెలిసింది.

రహస్యంగా భేటీ అయిన ఈ ఎమ్మెల్యేలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఫోన్ చేసి మాట్లాడినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశా లను ఆయన సీఎం, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి కూడా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయంపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది.

తాము సమావేశమైంది వాస్తవమేనని, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు ముందుగా సమాచారం ఇచ్చినట్లు గా  వారు చెబుతున్నారు. ఎమ్మెల్యేల సమావేశంలో ప్రత్యేకత ఏమీలేదని, డిన్నర్ చేయడానికి అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలం కలిశామని వారు చెపుతున్నారు.

ప్రభుత్వాన్ని అస్థిపర్చే కుట్ర : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య 

కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఈ సమావేశానికి తాను కూడా వెళ్లినట్లు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ దుష్పచారం చేస్తోందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆలేరు నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధ్దిని చూసి బీఆర్‌ఎస్ ఓర్చుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.  బీసీ సామాజిక వర్గానికి చెందిన తనపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎంత దుష్పచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.