calender_icon.png 21 October, 2024 | 10:23 AM

ఆమె ఉద్యమకారిణి!

02-07-2024 12:05:00 AM

అరుంధతీ రాయ్.. ప్రసిద్ధ రచయిత్రి, ఉద్యమకారిణి. ఈమె బుకర్ ఫ్రైజ్ పొందిన తొలి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. అంతే కాదు 2024 సంవత్సరానికి గాను పెన్ పింటర్ ఫ్రైజ్‌ను సొంతం చేసుకున్నా   అరుదైన రచయిత్రి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అరుంధతీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఆమె చేసిన రచనలేంటో తెలుసుకుందాం..

అరుంధతి రాయ్ మేఘాలయలోని షిల్లాంగ్‌లో జన్మించారు. తల్లి పేరు మేరీ రాయ్.. ఈమె కేరళకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త. తండ్రి ఒక బెంగాలీ బ్రహ్మణుడు. వీరిది ప్రేమ వివాహం. అరుంధతీ రాయ్  రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు అనివార్య కారణాల చేత తల్లిదండ్రులు విడిపోయారు. తర్వాత ఆమె తన సోదరుడితో కలిసి కేరళ వచ్చేశారు. కొంత కాలం వారి కుటుంబం మేరీ తల్లిదండ్రుల వద్దే గడిపారు. కేరళ వచ్చిన తర్వాత మేరీ సొంతంగా పాఠశాల ప్రారంభించారు. 

సినీ నిర్మాతగా..

అరుంధతీ రాయ్ కొట్టాయంలోని కార్పస్ క్రిస్టీలో తన పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత తమిళనాడులోని నీలగిరిలోని లారెన్స్ స్కూల్ చదివారు. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి చేశారు. అక్కడ ఆర్కిటెక్ట్ గెరార్డ్ డా కున్హా తో పరిచయం ప్రేమగా మారి 1978లో వివాహం చేసుకున్నారు. కొంత కాలం తర్వాత 1984లో డైవర్స్ తీసుకున్నారు.

విడాకుల అనంతరం ఢిల్లీ వచ్చిన అరుంధతికి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్‌లో స్థానం లభించింది. అక్కడే సినీ నిర్మాత ప్రదీప్ కిషన్‌తో పరిచయం ఏర్పడింది. అతనికి అవార్డు తెచ్చిపెట్టిన మస్సే సాహిబ్‌లో మేకల కాపరి పాత్ర కోసం ఆమెను అడిగారు. అదే ఏడాది వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి స్వాతంత్య్ర ఉద్యమం గురించి టెలివిజన్‌లో ధారావాహిక తీసుకొచ్చారు. అలాగే ఎలక్ట్రిక్ మూన్ అనే రెండు చిత్రాలకు పని చేశారు.

విమర్శకురాలిగా..

1988లో ‘ఇన్ విచ్ ఎనీ గివ్స్ ఇట్ దోస్ వోన్స్’ అనే చిత్రానికి ఆమె ఉత్తమ స్క్రీన్ ఫ్లే జాతీయ చలన చిత్ర అవార్డును అందుకున్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిగా తన అనుభవాల ఆధారంగా రూపొందించిన చిత్రమి ది. 1991లో పూలన్‌దేవి జీవితం ఆధారంగా తీసిన శేఖర్ కపూర్ చిత్రం ‘బాండిల్ క్వీన్’ను విమర్శించడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ‘ది గ్రేట్ ఇండియన్ రేప్ ట్రిక్’ అనే చలన చిత్రాన్ని కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ రెండు చిత్రాలు మహిళల జీవితాలను కించపరిచే విధంగా ఉన్నాయని వీటిని తప్పుగా చిత్రీకరించారని కపూర్‌ను ఆమె విమర్శించారు.  

ఒక రచయితగా..

1992లో ఆమె తన మొదటి నవల రాయడం ప్రారంభించారు. దీన్ని 1996లో పూర్తి చేశారు. ఈ పుస్తకం సెమీ ఆత్మకథ. తన చిన్ననాటి అనుభవాల ఆధారంగా రాసింది. ఆమె ప్రచురించిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అనే నవల ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నవల గాను  1997లో ఫిక్షన్ విభాగంలో బుకర్ ఫ్రైజ్ అందుకుంది. ది న్యూయార్క్ టైమ్స్ నోటబుల్ బుక్స్ ఆఫ్ ది ఇయర్‌లో ఒకటిగా గుర్తిం పు లభించింది. ఇక బెస్ట్ సెల్లర్స్ జాబితాలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.

18 దేశాల్లో ఈ పుస్తకం అమ్ముడు పోయింది. తర్వాత ‘ది బన్యన్ ట్రీ’ అనే ధారావాహికతో పాటు ‘ఎ ఫిల్మ్ విత్ అరుంధతీ రాయ్’ అనే డాక్యుమెంటరీ రాశారు. 2007లో తన రెండవ నవల ‘ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్’ మొదలు పెట్టారు. 2016లో దీన్ని పెంగ్విన్ ఇండియా, హమీష్ హామిల్టన్ యూకే వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ నవల 2017లో మ్యాన్ బుకర్ ఫ్రైజ్‌కు ఎంపిక చేయబడింది. 2018లో ఫిక్షన్ కోసం నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు ఫైనలిస్ట్‌గా ఎంపికయింది. 

ఆమె రచించిన ఆజాదీ పుస్తకం ఫ్రెంచ్ అనువాదానికి 45వ యూరోపియన్ ఎస్సే ఫ్రైజ్‌లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. యావత్ ప్రపంచం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను అరుంధతి తన కలం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న ఉగ్రవాదం, ఆజాదీ, ఫాసిజం గురించి అవి చేసే దాష్టికాలను, మారణ హోమాన్ని ఈ పుస్తకంలో కళ్లకు కట్టినట్టు రాశారు. ఎందరో జీవితాలను ప్రభావితం చేసేలా ఇందులోని వ్యాసాలు ఉన్నాయి.

ఎలాంటి కల్పితాలు లేకుండా వాస్తవాలకు దగ్గరగా ఉంటాయి ఈమె రచనలు. అలాగే సమకాలీన రాజకీయాలు, సంస్కృతికి సంబంధించిన అనేక వ్యాసాలు కూడా ఆమె రాశారు. 2014లో పెంగ్విన్ ఇండియా ఐదు వాల్యూమ్స్‌గా ఈమె రచనలను ముందుకు తీసుకొచ్చింది. 2019లో హేమార్కెట్ బుక్స్ ప్రచురించిన ‘మై సెడియస్ హార్ట్ అనే ఒకే సంపుటిలో నాన్ ఫిక్షన్ పుస్తకం తీసుకొచ్చారు. అరుంధతీ రాయ్ 2024 సంవత్సరానికి గానూ పెన్ పింటర్ ఫ్రైజ్ ను అందుకోనున్నారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషకరమని ఆమె అన్నారు. 

అవార్డు గురించి..

నోబెల్ గ్రహీత, నాటక రచయిత హెరాల్డ్ పింటర్ జ్ఞాపకార్థం 2009 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న అరుంధతీ రాయ్‌కి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఎలాంటి పరిస్థితిలకు చలించని తీరు, ప్రపంచం పట్ల నిర్మొహమాటమైన దృక్ప థం, నిజ జీవిత సత్యాలను, సమాజాన్ని వాస్తవికంగా చూపించే మేధో సంకల్పానికి నిదర్శనమైన రచనలు చేసిన యూకే, కామన్వెల్త్ గేమ్స్ దేశాలకు చెందిన రచయితలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అవా ర్డు జ్యూరీలో ఈ ఏడాది పెన్ ఫౌండేషన్ అధ్యక్షులు రూత్ బోర్త్‌విక్, నటుడు ఖలీద్ అబ్దుల్లా, రచయిత రోజర్ రాబిన్సన్ ఉన్నారు. ఒక భారతీయ మహిళా రచయితగా ఎందరికో స్ఫూర్తిదాయకం.