calender_icon.png 30 September, 2024 | 3:07 PM

సెంచరీతో కదం తొక్కిన శాశ్వత్

20-09-2024 12:00:00 AM

శ్రేయస్ అయ్యర్ డకౌట్ n దులీప్ ట్రోఫీ మూడో రౌండ్

అనంతపురం: దులీప్ ట్రోఫీ మూడో రౌండ్‌లో భాగంగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసే సరికి ఇండియా-డి పటిష్ఠ స్థితిలో నిలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ.. పడిక్కల్, శ్రీకర్ భరత్, రికీ భుయ్, సంజూ శాంసన్‌లు అర్ధ సెంచరీలతో రాణించడంతో మొదటి రోజు ఇండియా-డి 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్ (89*), సరన్ష్ (26*) ఉన్నారు. ఇండియా-బి బౌలర్లలో రాహుల్ చహర్ మూడు వికెట్లతో మెరిశాడు. ఇండియా-సితో జరిగిన మరో మ్యాచ్‌లో ఇండియా-ఏ ఆటగాడు శాశ్వత్ రావత్ (122*) సెంచరీతో చెలరేగాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ టాపార్డర్ కకావికలం కాగా.. శాశ్వత్‌తో జత కలిసిన శామ్స్ ములానీ(44) జట్టును ఆదుకున్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సరికి ఇండియా-ఏ జట్టు 7 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఇండియా సీ బౌలర్లలో అన్షుల్ కంటోజ్ 3, విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లతో సత్తా చాటారు. భారత్ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్న శ్రేయస్ అయ్యర్ దులీప్ ట్రోఫీలో డకౌట్‌గా వెనుదిరగడం ఇది రెండోసారి. ఇంతకముందు రెండో రౌండ్ పోటీల్లో ఇండియా-ఏతో మ్యాచ్‌లో సన్‌గ్లాసెస్‌తో వచ్చి డకౌట్ అయ్యి విమర్శలు మూట గట్టుకున్నాడు. తాజాగా మరోసారి డకౌట్‌గా వెనుదిరగడంతో టీమిండియా జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇస్తాడా అన్నది అనుమానంగా మారింది.