calender_icon.png 4 October, 2024 | 8:56 AM

శనిగకుంట మత్తడి నిందితుల అరెస్టు

04-10-2024 12:00:00 AM

మంచిర్యాల, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగకుంట చెరువు మత్తడి పేల్చివేత ఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. గత నెల 16న పేలుడు పదార్థాలతో మత్తడిని ధ్వంసం చేయగా, చెన్నూర్ ఇరిగేషన్ ఏఈ తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 20న పెండ్యాల లక్ష్మీనారాయణ, భీం మధూకర్, రసమల్ల శ్రీనివాస్, గోగుల దానయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

ఫోన్ కాల్స్, బ్యాంకు స్టేట్‌మెంట్ల ఆధారంగా మరికొందరిని గురువారం సాయంత్రం మంచిర్యాల డీసీపీ భాస్కర్ చెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితుల్లో నడిపెళ్లి లక్ష్మణ్‌రావు, మంచాల రాజబాపు, పెద్దింటి శ్రీనివాస్, లక్కం రాజబాపు, పోగుల శేఖర్, ఇప్ప సంపత్, ఉమేశ్ గిల్డా ఉన్నారు.

బత్తుల సమ్మ య్య, రాంలాల్ గిల్డా, ఎన్నం బానయ్యలు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు డీసీపీ వెల్లడించారు. కేసు పరిశోధనలో కృషి చేసిన జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్, ఎస్సై సుబ్బారావు, ఎస్సై శ్వేతతోపాటు కానిస్టేబుల్లు రాజశేఖర్, భూమన్నను అభినందించారు.