calender_icon.png 23 October, 2024 | 12:49 PM

శభాష్.. పోలీస్

22-07-2024 03:08:58 AM

నిర్మల్ జిల్లాలో లోయలో పడిపోయిన కారు

కారులో చిక్కుకున్న ముగ్గురిని కాపాడిన పోలీసులు

నిర్మల్, జూలై 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహమూబ్‌ఘాట్ వద్ద ఆదివారం తెల్లవారుఝామున లోయలో పడిపోయిన కారులో ఉన్న ముగ్గురిని నిర్మల్ పోలీసులు కాపాడారు. హైదరాబాద్‌కు చెందిన కృష్ణ.. అతని భార్య, కుమారుడితో కలిసి ఆదిలాబాద్ నుంచి హైదరాబాదు వైపునకు వెళ్తున్నారు. ఆదివారం తెల్లవారుఝామున రెండు గంటల సమయంలో నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహమూబ్‌ఘాట్ వద్ద రెండో మలుపు వద్ద వర్షం, మంచు కారణంగా రోడ్డు కనిపించకపోగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది.

కారులోనే చిక్కుకున్న కృఫ్ణ 100కు కాల్ చేయగా జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఆదేశాల మేరకు ఎస్‌ఐలు గోపి, శ్రీకాంత్ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరునొని కృష్ణతో పాటు అతని భార్య, కుమారుడిని కారు తలుపులు బ్రేక్ చేసి బయటకు తీశారు. వారిని వెంటనే పోలీసు వాహనంలో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో మేము ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని బాధితులు తెలిపారు. ముగ్గురు ప్రాణాలను కాపాడిన పోలీసులను మంత్రి సీతక్క, జిల్లా ఏస్పీ జానకీ షర్మిల ప్రత్యేకంగా అభినందించారు.