మరో రూ.550 పెరిగిన తులం ధర
హైదరాబాద్, ఆగస్టు 21: బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గించిన తర్వాత పడిపోయిన బంగారం ధర కొద్ది రోజుల నుంచి శరవేగంగా పెరుగుతున్నది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో గతవారంలో రూ.2,000పైగా పెరిగిన తులం ధర తాజాగా 73,000 స్థాయిని అధిగమించింది. బుధవారం హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ. 550 పెరిగి రూ.73,200 వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 మేర పెరిగి రూ.67,100వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం రాత్రి ఔన్సు బంగారం ధర 2,540 డాలర్లకు పెరిగింది. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న బుల్లిష్ ట్రెండ్ కారణంగా పుత్తడి ధరలు పెరుగుతున్నాయని బులియన్ వర్తకులు తెలిపారు. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఈ సెప్టెంబర్లో వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో అదేపనిగా బంగారం పెరుగుతున్నది.