21-02-2025 01:15:30 AM
నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవు
రాష్ర్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్నగర్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలు, వసతి గృహాలతో పాటు భోజనాన్ని అందిస్తున్న ప్రతి సంస్థలో నాన్నతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందించాలని రాష్ర్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ర్ట ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఫుడ్ కమిషన్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, ఆనంద్లు మహబూబ్ నగర్ జిల్లా భూత్ఫూర్ మండలం తాటి కొండ గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను,అమిస్తాపూర్ లో మహత్మా జ్యోతి బా పూలే బి.సి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు.
జడ్చర్ల మండలం మాచారం గ్రామం లో చౌక ధరల దుకాణాన్ని సందర్శించారు.కార్డ్ దారులకు రేషన్ సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు.అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు 36 మందికి ప్రతి నెల చక్కెర సరఫరా చేయక పోవడం తెలుసుకుని,డీలర్ ను చక్కెరకు డి.డి.కట్టి ప్రతి నెల కార్డ్ ధారునికి సరఫరా చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీలకు ఆహారాన్ని ఇంటికి పంపించవద్దని, తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలో నే గర్భిణీలు భోజనం చేసి వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంగన్వాడి టీచర్ కు సూచించారు. కేంద్రంలో ఒకరిద్దరు పిల్లల బరువును పరిశీలించారు.. కేంద్రానికి పాలు గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ గురించి తెలుసుకున్నారు. గుడ్లు తక్కువ సైజులో సరఫరా చేయడం గమనించి కాంట్రాక్టర్ కు బిల్లు లు నిలిపి వేయాలని సూచించారు.
సిడిపివోలు క్రమం తప్పకుండా అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసి కేంద్రాల పనితీరును, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాకు చేరుకున్న రాష్ర్ట పుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస రెడ్డి,సభ్యులు గోవర్ధన్ రెడ్డి,ఆనంద్ లకు రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు జడ్చర్లలో స్వాగతం పలికారు.జడ్చర్ల శాసన సభ్యులు అనిరుధ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కమిషన్ చైర్మన్,సభ్యులను కలిశారు. ఈ తనిఖీలలో డిఆర్డిఓ నర్సిం హులు, జిల్లా విద్యా శాఖ అధికారి ప్రవీణ్ కుమార్, జిల్లా పి సరఫరాల అధికారి వెంకటేష్ మహిళా శిశు సంక్షేమ అధికారిణి జరీనా బేగం జిల్లా బి.సి. సంక్షేమ అధికారిణి ఇందిరా, తదితరులు ఉన్నారు.