19-03-2025 12:31:58 AM
తుపాకీతో ఆలయంలోకి మహిళ ప్రవేశం..
జమ్మూ: జమ్మూలోని ప్రఖ్యాత శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఒక మహిళ సెక్యూరిటీ తనిఖీలను దాటుకొని పిస్తోలుతో ఆలయంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై తాజాగా పోలీసులు స్పందించారు. ఢిల్లీ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న జ్యోతి గుప్తా ఈ నెల 15న పిస్తోలుతో వైష్ణోదేవి ఆలయంలోకి ప్రవేశించింది. దీనిని గమనించిన ఆలయ అధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
గడువు ముగిసిన లైసెన్సడ్ తుపాకీని ఆలయంలోకి తీసుకొచ్చినందుకు జ్యోతి గుప్తాపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆమె తుపాకీతో ఆలయం లోపలికి వచ్చే వరకు భద్రతా సిబ్బంది గుర్తించకపోవడంపై భక్తులు పెదవి విరిచారు. ఇకనైనా ఆలయ సిబ్బంది, అధికారులు భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. అయితే జ్యోతి గుప్తా ఢిల్లీ పోలీసు విభాగంలో పనిచేయడం లేదని ఎస్పీ పర్మీందర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.