calender_icon.png 4 October, 2024 | 3:00 PM

రాష్ట్రంలో భద్రత కరువు : హరీశ్ రావు

04-10-2024 12:13:56 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బాలికలకు, మహిళలకు భద్రత కరువైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. భద్రత కల్పించవలసిన ప్రభుత్వం  బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ద్వజమెత్తారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా నిర్లక్ష్యం వీడలేదని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఫలితంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని పేర్కొన్నారు. 

తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో  రెండు వేలకు పైగా అత్యాచారాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. హోం మంత్రిత్వ శాఖను కూడా తానే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్న హరీశ్ రావు షీ టీమ్స్, సఖి భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి భద్రత కల్పించిందని చెప్పారు. కానీ ఇందిరమ్మ రాజ్యం అని ఊదరగొట్టడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యతలో మహిళా భద్రత లేదని తేటతెల్లమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి శాంతి భద్రతల పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులకు  కఠిన శిక్షలు పడేలా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.