10-04-2025 01:42:57 AM
జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ
కాటారం (భూపాలపల్లి), ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : మారుమూల ప్రాంతాల్లో అంగన్ వాడి సిబ్బంది సేవలకు స్కూటీలు, రైతులకు ఉపయోగపడే డ్రోన్లు, వైద్య సేవల పరికరాలు జిల్లా ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ఈసీఐఎల్ కంపెనీ సిఎస్ఆర్ నిధులు నుండి 20 ఎలక్ట్రానిక్ స్కూటీలు, 12 డ్రోన్ల పంపిణీ చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడి సూపర్ వైజర్లు మారుమూల గ్రామాల్లో సేవలు అందించడానికి, వ్యవసాయంలో డ్రోన్లు వినియోగం, వైద్య సేవలు సిటీ స్కాన్, ఇతర పరికరాలు ఈసిఐఎల్ సి ఎస్ ఆర్ నిధులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మారుమూలు ప్రాంతాలకు అంగన్వాడి సూపర్ వైజర్లు వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు లేవని, ఎలక్ట్రానిక్ స్కూటీలు కుగ్రామానికి సైతం సులువుగా వెళ్ళడానికి ఉపయోగ పడతాయని తెలిపారు. ఈ రోజుల్లో వ్యవసాయ పనులకు కూలీలు కొరత ఉందని, ఈ ఆధునిక సాంకేతికత డ్రోన్లు వినియోగం రైతులకు చాలా ఉపయోగమని అన్నారు.
రసాయన మందులు పిచికారీ సమయంలో ప్రజలు ప్రాణాలకు అపాయం ఏర్పడుతుందని, డ్రోన్లు వినియోగం ద్వారా ప్రాణాలకు ఎలాంటి అపాయం ఏర్పడదని, సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. అలాగే జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలకు సిటీ స్కాన్ ఇతర పరికరాలు ఇవ్వనున్నారని తెలిపారు.
రానున్న నెల రోజుల్లో వైద్య పరికరాలు ఏర్పాటు జరుగుతుందిని తెలిపారు. ఈసిఐఎల్ సి అండ్ ఎండి అనురాగ్ కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ స్కూటీ లు, డ్రోన్లు, వైద్య పరికరాలు మొత్తం 4 కోట్ల సి ఎస్ ఆర్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. స్కూటీలు, డ్రోన్లు వినియోగం వల్ల అంగన్వాడీ సేవలకు, రైతులకు ఉపయోగకరమని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సీపీఓ బాబు రావు, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, వ్యవసాయ అధికారి వీరు నాయక్, ఆసుపత్రి పర్య వేక్షకులు డా నవీన్ కుమార్, ఈసిఐఎల్ హెచ్ ఆర్ ఈడీ మురళీధర్, సీఎంఓ వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.