21-03-2025 09:57:18 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): తమిళనాడు రాష్ట్రంలోని అటామిక్ ఎనర్జీ విభాగం, సైంటిఫిక్ ఆఫీసర్-ఎఫ్ గా విధులు నిర్వహిస్తున్న బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థి రంగ రామకృష్ణ మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ఆయనను ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్, ఏ ఇ ఐ హెచ్ ఓ డి వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సైంటిఫిక్ అధికారి (ఎఫ్) రంగ రామకృష్ణ మాట్లాడుతూ... బెల్లంపల్లిలోని సీఎస్ఐ హైస్కూల్లో చదివిన అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేరడం జరిగిందని ఆరోజు కనీస సౌకర్యాలు లేకున్నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 90% ఉత్తీర్ణత సాధించగలిగామని తెలిపారు.
ఉన్నత చదువులు చదివి దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగడానికి పునాది ఈ కళాశాల ఆని కళాశాల లోని అప్పటి జ్ఞాపకాలని విద్యార్థులతో పంచుకున్నారు. మూడు సంవత్సరాలు కష్టపడి కోర్సులు పూర్తిచేస్తే, 30 సంవత్సరాలు జీవితంలో వెనుకకు చూడకుండానే జీవితం కొనసాగించవచ్చని తెలిపారు. కళాశాల విద్యార్థులకు అవసరమైనప్పుడు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ మాట్లాడుతూ ఇక్కడ చదివిన విద్యార్థి దేశానికి సేవ చేసే సైంటిఫిక్ అధికారిగా బాధ్యతలు చేపట్టడం చాలా గర్వకారణంగా ఉందని కొనియాడారు. విద్యార్థులకు ఒక మోటివేటర్ గా రంగ సైంటిఫిక్ ఆఫీసర్ రంగ రామకృష్ణ జీవితం ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సురేష్, పూర్వ విద్యార్థి సామాజిక కార్యకర్త రంగ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.