శాస్త్ర స్కూల్ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
షాద్నగర్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): నీరజ్ మృతికి కారణ మైన శాస్త్ర స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్), ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.
విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని, విద్యార్థి కుటుం బానికి న్యాయం జరగాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్, ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్లు డిమాండ్ చేశారు.
వేలకు వేలు ఫీజులు తీసుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటు విద్యార్థుల శవాలను ఇంటికి పంపిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సిఐ విజయ్ కుమార్ తదితర సిబ్బంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థి నీరజ్ మృతి బాధాకరం
షాద్నగర్ పట్టణానికి చెందిన నీరజ్ అనే పదవ తరగతి విద్యార్థి శాస్త్ర ప్రైవేటు పాఠశాల భవనం పైనుంచి దూకి మృతి చెందడం చాలా బాధాకరమని, దురదృష్టకరమని బీజేపీ నాయకులు అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకుడు చీపిరి రవియాదవ్ లు ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.
పాఠశాల యజమాన్యంపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నదని అన్నారు.