calender_icon.png 18 March, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులకే పథకాలు

18-03-2025 01:10:45 AM

  1. అబద్ధ్దాలతో ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం లేదు
  2. మంత్రులను తొలగిస్తేనే పాలనపై పట్టున్నట్లా..
  3. రాజీవ్ యువ వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి) : పరిపాలనను ప్రక్షాళన చేస్తూ పారదర్శక విధానాలతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వంలో అర్హులైన వారికే పథకాలు అందుతాయ న్నారు. పథకాల అమలులో పారదర్శకంగా ఉం డాలని.. అప్పుడే ప్రజలకు మెరుగైన పాలన అం దించగలుగుతామన్నారు.

ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదని సీఎం పేర్కొన్నారు. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడపదలచుకోలేదన్నారు. అందుకే దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముం దుకు వెళుతున్నామని సీఎం స్పష్టం చేశారు. రూ. 6 వేల కోట్లతో 5 లక్షల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

సోమవారం సాయం త్రం అసెంబ్లీ ఆవరణలో రాజీవ్ యువ వికా సం పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచే కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో ప్రారంభిం చుకున్నామని.. ఈ 15 నెలల్లో 57 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామని ఆయన తెలిపారు.

50 లక్షల కుటుంబాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వెలుగులు చూస్తున్నామన్నారు. 43 లక్షల కుటుంబాలు రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు 1 కోటి 30 లక్షల నాణ్యమైన చీరలు అందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ర్టంలోని 29,500 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యు త్ అందిస్తున్నామని.. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో పాఠశాలల నిర్వహణ ఆడబిడ్డల కు అప్పగించామని పేర్కొనారు. కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిదని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. కులగణన నిర్వహించి ఇవాళ బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకుంటున్నామన్నారు.

కులగణనలో బీసీల లెక్క 56.36 శాతంగా తేలిందని.. వారికి 42 శాతం రిజర్వేషన్లు అందించాలన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు బిల్లును కూడా సభ ముందుకు తీసుకొచ్చామన్నారు. దీనిని ఆమోదించుకుని ఎస్సీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

ఆదాయం పెంచే ప్రయత్నాలు..

ఇసుక, ఇతర విధానాలను స్ట్రీమ్ లైన్ చేస్తూ ప్రభుత్వ ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తున్నామని.. గతంలో ఇసుకపై రోజుకు ప్రభుత్వానికి రూ. కోటిన్నర ఆదాయం వస్తే.. ఇవాళ ఇసుక ఆదాయం రూ. మూడున్నర కోట్లకు పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.

నిరుద్యోగ సమస్యను 8.8 నుంచి 6.6 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. ద్రవ్యోల్బణంలో 1.3 శాతంతో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఇవి తాము చెప్పే గణాంకాలు కావని.. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన గణాంకాలన్నారు.

తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని సీఎం పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ, టీచర్ల బదిలీలు ఎలాంటి ఆరోపణ లేకుండా పారదర్శకంగా నిర్వహించినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. 

రూ. 50వేల నుంచి రూ. 4 లక్షల వరకు రాజీవ్ యువ వికాసం రుణాలు..

రాజీవ్ యువ వికాసం ద్వారా రూ. 50వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలు మంజూరు చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించుకున్నామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల మందికి ఉపాధి కలిగించవచ్చన్నారు. నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని ఏప్రిల్ 4 వరకు అప్లు చేసుకోవచ్చాన్నారు.

ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల మంజూరు ఉంటుందని.. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని అన్నారు. నిజమైన నిరుద్యోగులకు ఈ పథకం అందాలన్నారు. ఇది పార్టీ పథకం కాదు.. ప్రజల పథకంటూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు.

తనకు ఇప్పటికీ పాలనపై పట్టు లభించలేదని కొందరు అంటున్నారని.. మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తే పట్టు ఉన్నాట్లా.. అధికారులను తొలగించడం, బదిలీ చేయడం చేస్తేనే పట్టు ఉన్నట్లా అని ప్రశ్నించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే స్వయం ఉపాధికి దోహదపడాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు.

యువ వికాసం పథకాన్ని ఉపయోగించుకొని యువత ఉపాధి కల్పించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఎవరి కోసం..

రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. యువ వికా సానికి మార్చి  17 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించను న్నారు. ఏప్రిల్ 6 నుంచి మే 30 వరకు లబ్ధిదారుల ఎంపిక, యూనిట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. 

* కేటగిరి-1: రూ. లక్ష వరకు రుణం, 8౦ శాతం రాయితీ.

* కేటగిరి-2: రూ. 2 లక్షల వరకు సాయం, 7౦ శాతం రాయితీ.

* కేటగిరి-౩: రూ. ౩ లక్షల వరకు సాయం, 6౦ శాతం రాయితీ.