క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సాహిస్తున్నాం
100 కోట్ల సంక్షేమ నిధి కేటాయింపు
ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి
హైదరాబద్,(విజయక్రాంతి): ఎస్సీ గురుకులాల్లోని క్రీడాకారులైన విద్యార్థులకు ప్రోత్సహించడంపై కొందరు వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి ఆదివారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తైవాన్లో జరుగుతున్న ఏషియన్ యూనివర్సిటీస్ వుమెన్ సాఫ్ట్బాల్ ఏషియా కప్ పోటీలకు ఎస్సీ గురుకులాలకు చెందిన ముగ్గురు విద్యార్థునులు ఎంపికయ్యారని, ఆ విద్యార్థులు వారి కోచ్తో కలిసి ఇప్పటికే చెన్నై నుంచి తైవాన్కు వెళ్లారని స్పష్టం చేశారు.
వారికి కావాల్సిన అన్ని వసతులు, ప్రయాణ సదుపాయాలను ఎస్సీ గురుకుల సొసైటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ విద్యార్థులకు సీఎం రేవంత్రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్ అభినందనలు తెలిపి, విజయంతో తిరిగి రావాలని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు వారి స్వార్థం కోసం ఎస్సీ గురుకులాలపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. నైపుణ్యం ఉన్న షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.100 కోట్ల సంక్షేమ నిధిని కేటాయించిందని, కానీ చాలా మందికి ఈ విషయం కన్పించడం లేదని ఎద్దేవా చేశారు.