calender_icon.png 26 October, 2024 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభ

13-08-2024 01:14:00 AM

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిజాం కాలేజీ వరకు భారీ ర్యాలీ 

మంద కృష్ణకు స్వాగతం పలకనున్న ఎమ్మార్పీఎస్

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఎస్సీరిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లో ‘వర్గీకరణోత్సవ సభ’ నిర్వహిస్తున్నారు. 13 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి క్లాక్‌టవర్, ట్యాంక్‌బండ్, అంబేద్కర్ విగ్రహం మీదుగా బషిర్‌బాగ్ చౌరస్తా నుంచి బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు భారీ ర్యాలీగా నిర్వహించనున్నారు. అక్కడే సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి మాదిగలు భారీగా తరలిరానున్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల్లోని మాదిగ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆహ్వానించారు. 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనెల 1న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే హక్కును కల్పిస్తూ తీర్పు ఇవ్వడంతో మాదిగల్లో ఉత్సాహం నెలకొన్నది. దీంతో మంగళవారం నిర్వహించే సభకు భారీగా తరలివస్తారని ఎమ్మార్పీఎస్ శ్రేణులు చెప్తున్నాయి.