14-04-2025 02:03:21 AM
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాధ్యం చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమేనని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచనల నుంచి ప్రేరణ పొంది ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలు తమ ప్రభుత్వం తీసుకున్నదని చెప్పారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి సీఎం ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు ఆయన అవిశ్రాంతంగా కృషిచేశారని వివరించారు. దూరదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని స్మరించారు.
ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. దళితుల అభ్యున్నతిలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేద్కర్ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య, రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.