07-02-2025 12:43:07 AM
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో స్టాండలోన్ ప్రాతిపదికన రూ.16,891 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.9163 కోట్ల నికర లాభంతో పోలిస్తే నికర లాభం 84 శాతం పెరిగింది.
మార్కెట్ అంచనాలు మించి నికర లాభాన్ని నమోదు చేయడం విశేషం. అంతకుముందు త్రైమాసికంతో పోల్చినప్పుడు మాత్రం నికర లాభంలో 8 శాతం క్షీణత నమోదైంది. క్యూ2లో నికర లాభం రూ.18,331 కోట్లుగా ఉంది. ఇక సమీక్షా త్రైమాసికంలో వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.1.06 లక్షల కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1.17 లక్షల కోట్లకు పెరిగింది. గత త్రైమాసికంలో 2.13 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు 2.07 శాతానికి తగ్గాయి. అలాగే 0.53 శాతంగా ఉన్న నికర ఎన్పీఏలు స్థిరంగా కొనసాగుతున్నాయి.