హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): నగరంలో వరుసగా జరుగుతున్న నేరాలపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దృష్టి సారించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్ల స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో నిఘా విభాగం(స్పెషల్ బ్రాంచ్) ఎంతో కీలకమైందని, ఎస్బీ సిబ్బం ది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎస్బీ సిబ్బంది ఇచ్చే సమాచారం వల్లనే పైస్థాయి అధికారులు చర్యలు చేపట్టే వీలుంటుందని అన్నారు. తమ పరిధిలో ఎక్కడ ఏ చిన్న సమాచారం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే ఉన్నతాధికారులకు చేరవేయాలని సూచించారు.
అలాగే అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వారిని వెంటనే తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సభలు, సమావేశాలు, క్లాసులు ఏర్పాటు చేసే వారి విషయంలో నిరంతరం సమాచారం వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. పాస్పోర్ట్ వెరిఫికేషన్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా పనిచేయాలని, అప్పుడే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందన్నారు. సమావేశంలో డీసీపీ ఎస్ చైతన్య, ఎస్బీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.